రాష్ట్రీయం
ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంలో తేల్చుకుంటాం
-
మంత్రి మాణిక్యవరప్రసాద్
గుంటూరు, కెఎన్ఎన్ బ్యూరో: ముస్లిం మైనారిటీలకు విద్యారంగంలో అమలుచేస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యంకాదని, దీనిపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయనున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం గుంటూరులో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16ను అనుసరించి చట్టబద్ధంగా వెనుకబడిన సామాజిక, ఆర్ధిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించే వెసులుబాటు ఉందన్నారు. ముస్లిం మైనారిటీలు గత ఐదారు దశాబ్దాల కాలంగా విద్యారంగంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తించి రిజర్వేషన్లను అమలులోకి తెచ్చారన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ల ఆవశ్యకతపై జస్టిస్ రంగనాధ్ మిశ్రా కమిషన్ పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించిందని, దాని ప్రాముఖ్యతను హైకోర్టు గుర్తించకపోవటం విచారకరమన్నారు.
గతంలో కూడా మండలి కమిషన్ తదితర అంశాలపై హైకోర్టు సాంకేతికపరమైన అంశాలను సాకుగా చూపి ప్రజా వ్యతిరేక తీర్పులు వెలువరించినప్పటికీ సుప్రీం కోర్టులో తగిన న్యాయం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల విషయంలో కూడా సుబ్రహ్మణ్యం, కృష్ణమీనన్ కమిషన్ల సిఫార్సుల వివరాలు తగినంతగా లేవనే సాకుతో హైకోర్టు తీర్పు వెలువరించటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రప్రభుత్వం కాకుండా స్వయంగా తాను ప్రముఖ న్యాయవాది కన్నాభిరన్ సహకారంతో లిఖితపూర్వకంగా వాదనలను హైకోర్టుకు సమర్పించామని ఇదే స్ఫూర్తితో సుప్రీం కోర్టులో తానే స్వయ ంగా రిజర్వేషన్ల అమలుకు ఉద్యమిస్తామని తెలిపారు. ముస్లింలలో కూడా సామాజిక, ఆర్ధికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో ముస్లింలు అందరితో సమానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉండాలనే ఆకాంక్షతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల ఆవశ్యకత పూర్తిగా ఉందన్నారు.
గాలి వ్యాఖ్యలు అర్ధరహితం
ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి రామచంద్రరావు, జనాదరణ కలిగిన ఎంపి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నగరి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యలు చేయటం అర్ధరహితమన్నారు. సీనియర్ నాయకునిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. మంత్రి దామోదర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడనేది విస్మరించి తెలంగాణకు వత్తాసు పలకటం సమంజసం కాదన్నారు.
రాశి ఫలాలు






