రాష్ట్రీయం
రైల్వే క్యూ ఇక్కట్లకు స్వస్తి ఎటివిఎం టిక్కెట్లు
-
ఎంఎంటిఎస్, ప్లాట్ఫాం, రెండవ శ్రేణిరైలు టిక్కెట్లు : ప్రారంభించిన జిఎం జయంత్
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : రైలు ప్రయాణీకులకు శుభవార్త. టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. దేశంలోనే మొదటి సారిగా రెండవశ్రేణి రైలు టిక్కెట్లను కూడా ఆటోమేటెడ్ టిక్కెట్ వెండింగ్ మేషిన్స్( ఏటివిఎం)ల ద్వారా విక్రయించే సదుపాయాన్ని దక్షిణమధ్యరైల్వే (ఎస్సిఆర్) ప్రారంభించింది. ఎస్ఎంఎస్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించే సదుపాయాన్ని కూడా రైల్వేశాఖ కల్పించింది. రైల్వే జిఎం ఎం.ఎస్. జయంత్ ఈ సౌకర్యాలను సోమవారం రైల్ నిలయంలో లాంఛనంగా ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్సిటి స్టేషన్లలో 19 ఏటివిఎంలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దశల వారిగా దక్షిణమధ్యరైల్వే స్టేషన్ల పరిధిలో ఎటివిఎంలను విస్తరిస్తామని జయంత్ చెప్పారు. ముంబై, చెన్నై స్టేషన్లలో గతంలోనే సబర్బన్ టిక్కెట్లను ఎటివిఎంల ద్వారా విక్రయిస్తోందని, రెండవశ్రేణి టిక్కెట్లను విక్రయించడం దేశంలోనే ఎస్సిఆర్లోనే మొదటిసారని అన్నారు. 24 గంటలు ఈ ఎటివిఎంలు పని చేస్తాయని తెలిపారు. ఎటివిఎంల ద్వారా టిక్కెట్లు తీసుకోవడానికి స్మార్ట్ కార్డ్లు ఏర్పాటు చేశామన్నారు. రూ. 80 చెల్లించి స్మార్ట్ కార్డులు తీసుకోవచ్చని, అందులో రూ. 30 ను మళ్లీ చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ అని అన్నారు. రూ. 100 కార్డు తీసుకుంటే 5 శాతం బోనస్తో రూ. 105 విలువ చేసే కార్టు ఉంటుందన్నారు. ఒక్కో ఎటిఎం మిషన్ ఖరీదు రూ. 3.71 లక్షలని, 21 ఎంఎంటిఎస్ స్టేషన్లలో 75 మిషన్లను మంజూరు చేశామని తెలిపారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫిర్యాదులు, సలహాల ఇస్తే వెంటనే జవాబు ఇచ్చే సౌకర్యం కూడా అందులో ఉందని జిఎం పేర్కొన్నారు. 81212 -81212 నంబర్లకు ఎస్ఎంఎస్లు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు ఎలాంటివో కూడా తెలియజేస్తామన్నారు.
పెరిగిన స్థూల వృద్ధిరేటు 9.1 శాతం
ఆందోళనల వల్ల రూ. 50 కోట్లు నష్టం
ఇటీవల తలెత్తిన ఆందోళనల వల్ల సంస్థకు రూ. 50 కోట్ల నష్టం వాటిల్లిందని జయంత్ తెలిపారు. అయినప్పటికీ తమజోన్ అన్ని రంగాలలో ప్రగతి పథంలో ఉందని పేర్కొన్నారు. స్థూలవృద్ధి రేటు 9.1 శాతంతో రూ. 511 .74 కోట్ల రెవెన్యూ సాధించిందని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి స్టేషన్గా మార్చడానికి రూ. 5,500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కోటి మంది ప్రయాణీకులను అదనంగా గమ్యస్థానాలకు చేర్చామని చెప్పారు. గత సంవత్సరం కంటె 10 మెట్రిక్ టన్నులను అదనంగా రవాణా చేశామన్నారు. వార్షిక వృద్దిరేటు 4.40 శాతానికి చేరుకుందన్నారు. రోజువారి రైళ్లే కాక ఈ సంవత్సరం 1,191 ప్రత్యేక రైళ్లను ఇప్పటివరకు నడిపామని, 13,028 అదనపు కోచ్లు వేశామని పేర్కొన్నారు. పండుగలు, వారాంతపు సెలవులకు 338 ప్రత్యేక రైళ్లు నడిపామన్నారు. కొత్తగా 83 మంది హోంగార్డ్స్ను తీసుకున్నామని, మరో 212 మంది శిక్షణలో ఉన్నారని తెలిపారు. ఒక్కో ఎంఎంటిఎస్ రైలుకు నలుగురు హోంగార్డులు రక్షణగా ఉంటారన్నారు. టెండర్ల పరికరాలకు భద్రత కల్పించిన ఘనత ఎస్సిఆర్కే దక్కుతుందని, సికింద్రాబాద్, హైదరాబాద్, తిరుపతిలలో ఈ విధమైన సౌకర్యాలు కల్పించామన్నారు. సరకుల రవాణా, ప్యాసింజర్లను ఆకట్టుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. రూ. 4 వేల కోట్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. సామల్కోట -కాకినాడ పోర్డు, గుంటూరు -కృష్ణా కాలువ వరకు 44 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు, ధర్మవరం -పాకాల సెక్షన్లో 145 కిలోమీటర్ల గేజ్ మార్పిడి పనులు, యర్రగుంట్ల -నాసం మధ్య 50 కిలోమీటర్ల కొత్తలైను పనులు, 119 కిలోమీటర్ల పరిధిలో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని జిఎం తెలియజేశారు. ప్రయాణీకుల సౌకర్యాల పెంచడానికి రూ. 160.76 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 18 ఆదర్శ రైల్వేస్టేషన్ల పనులు చురుకుగా సాగుతున్నాయని, ఈ ఏడాది ఆఖరుకు పనులు పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న పనులకు రూ. 4593.28 కోట్లు అవసరమవుతాయని జయంత్ తెలిపారు. అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తయ్యేందుకు ఆధునిక యంత్రాల ఆవశ్యకతను గుర్తించామన్నారు. మంగళవారం నుంచి జోన్ అభివృద్దిపై పార్లమెంట్ సభ్యుల సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. నాందేడ్, సికింద్రాబాద్ సెక్షన్ల పరిధిలోని ఎంపిలతు సమావేశమవుతామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ జిఎం అరుణ్ బాగ్రా, చీఫ్ కమర్షియల్ మేనేజర్ మదన్ మోహన్రావు, చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ రాకేష్ సక్సేనా, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (నిర్మాణం) ఎస్.కె. శర్మ, సిపిఆర్ఓ చంద్రిమారాయ్ పాల్గొన్నారు.
రాశి ఫలాలు






