క్రీడాప్రభ
కమ్రాన్ అక్మల్ ,పాక్ కోచ్ ఆలమ్లకు ఉద్వాసన
లాహోర్, ఫిబ్రవరి 8: దుబాయిలో ఈ నెల ద్వితీయార్ధంలో ఇంగ్లండ్తో ఆడే రెండు ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు సోమవారం 14 మంది సభ్యులతో ఎంపిక చేసిన పాకిస్థాన్ జట్టులో వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్కు స్థానం కల్పించలేదు. షోయబ్ మాలిక్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తాడు. కోచ్ ఇంతిఖాబ్ ఆలమ్ను ఈ జట్టుకు కోచ్గా ఎంపిక చేయలేదు. కాగా, ఇంతిఖాబ్ ఆలమ్ భవితవ్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. చేతి గాయం నుంచి కోలుకున్న వెటరన్ ఆల్రౌండర్ అబ్దుర్ రజాక్ను, ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ యాసిర్ అరాఫత్ను జట్టులోకి తిరిగి తీసుకున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో సీరీస్లో అత్యంత ఘోరంగా ఓడిపోయిన తరువాత ఊహించిన విధంగానే పాక్ జట్టులో మార్పులు జరిగాయి. కమ్రాన్ అక్మల్ బదులు సర్ఫరాజ్ అహ్మద్కు స్థానం కల్పించారు. సర్ఫరాజ్ ఆస్ట్రేలియాలో మూడవ టెస్ట్లో వికెట్కీపర్గా ఆడాడు. కాని ఐదు ఒడిఐలలో గాని, టి20 గేములో గాని అతనిని ఆడించలేదు. పెర్త్లో ఆస్ట్రేలియాతో ఐదవ ఒడిఐ పోటీలో బాల్ టాంపరింగ్ అభియోగానికి రెండు మ్యాచ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్నందున రెగ్యులర్ ట్వంటీ20 కెప్టెన్ షహీద్ అఫ్రీదీ కూడా దుబాయిలో మొదటి గేము ఆడలేడు. “అఫ్రీదీని రెండు మ్యాచ్లకు నిషేధించి ఉండకపోతే అతనే జట్టుకు సారథ్యం వహించి ఉండేవాడు’ అని పిసిబి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాసిమ్ బారి చెప్పినట్లు “ది డాన్’ పత్రిక తెలియజేసింది. అయితే, ఏప్రిల్, మే నెలల్లో వెస్టిండీస్లో జరిగే ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాక్ జట్టుకు అఫ్రీదీ సారథ్యం వహిస్తాడని బారి చెప్పారు. కాగా, ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ వరుసగా ఓడిపోవడం వల్ల చీఫ్ సెలక్టర్ ఇక్బాల్ ఖాసిమ్ కూడా తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. దీనితో పిసిబి చైర్మన్ ఇజాజ్ బట్ ఇతర సెలక్టర్లను సంప్రదించి టి20 జట్టును ఖరారు చేయవలసి వచ్చింది. ఇది ఇలా ఉండగా, మాజీ టెస్ట్ బ్యాట్స్మన్ ఇజాజ్ అహ్మద్ను ట్వంటీ20 జట్టుకు బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్గా నియమించారు.
పాక్ జట్టు సభ్యుల పేర్లు: షోయబ్ మాలిక్ (కెప్టెన్), ఇమ్రాన్ నజీర్, ఇమ్రాన్ ఫర్హత్, ఖాలిద్ లతీఫ్, ఉమర్ అక్మల్, ఫవద్ ఆలమ్, షహీద్ అఫ్రీదీ, సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్, సయీద్ అజ్మల్, వాహబ్ రియాజ్, మహమ్మద్ తల్హా, అబ్దుర్ రజాక్, యాసిర్ అరాఫత్.
రాశి ఫలాలు






