కడప
తెలంగాణ విద్యార్థులే కెసిఆర్ను తరిమి కొడతారు -ప్రొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డి
పులివెందుల రూరల్, ఫిబ్రవరి 8 (కెఎన్ఎన్) తెలంగాణా ప్రత్యేక నినాదంతో ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆ ప్రాంత విద్యార్థులే తరిమి, తరిమి కొడతారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. పులివెందుల టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసమే కెసిఆర్ పగటి వేషం వేసి కొత్త అవతారమెత్తారన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతుందని, దీంతో ఆ ప్రాంత విద్యార్థులే కెసిఆర్ ను తరిమి, తరిమి కొడతారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఇలాగే ప్రవర్తిస్తే తొండలు పట్టుకోవడానికి తప్ప మరెందుకు పనికిరాకుండా పోతాడని విమర్శించారు. తెలంగాణా ప్రత్యేక ఏర్పాటు కోసం కెసిఆర్ కపట నాటకం ఆడుతున్నారని తెలుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి చిదంబరంలు గత నెల 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏడు కోట్ల ఆంధ్రులను విడగొట్టడం, అవసరమైతే రాష్ట్రాలను ముక్కలు చేయడం, విభజన పేరుతో అనవసర రాద్దాంతం చేస్తున్న చిదంబరాన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాటు వాదం ఉందని, యఅయితే కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ మీదనే చిదంబరం పదేపదే ప్రకటన చేయడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి మాజీ మంత్రులు పొన్నంరెడ్డి రామసుబ్బారెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డిలు మాట్లాడుతూ పేదలను నిలువుదోపిడీ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీయే సాటి అన్నారు. ఇందుకు ఆర్టీసి, వంటగ్యాస్ తదితర వాటి చార్జీలు, ధరలు పెంచడం ఇందుకు నిదర్శనమన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు అందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు ఇస్తామని వాగ్దానాలు చేసి, అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రికవరి పేరుతో అర్హులైన వారి కార్డులు, ఫించన్లను తొలగించడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే మభ్యపెట్టడం మినహా మరే సహాయం చేసే స్థితిలో ఉండదని, ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దారెడ్డిలు కూడా ఉన్నారు.
రాశి ఫలాలు






