కడప
అర్హులకు రేషన్ ఇవ్వకుంటే డీలర్ల సస్పెన్షన్ కలెక్టర్ హెచ్చరిక
కడప, ఫిబ్రవరి 8 (కెఎన్ఎన్ ప్రతినిధి): అర్హులైన వారికి రేషన్ ఇవ్వకపోతే సంబంధిత డీలర్లను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ శశిభూషణ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన అమరనాథరెడ్డి మాట్లాడుతూ తనకు నాలుగుచక్రాల వాహనం లేకున్నా వుందని రాసి తెల్లరేషన్ కార్డు రద్దు చేశారని, ఈ నెల బియ్యం ఇవ్వలేదని, 12వ నంబరు చౌకదుకాణపు డీలర్ నాగిరెడ్డిపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందిస్తూ సందేహాస్పద జాబితాలో పేరు వుంటే గ్రామసభలో తాహసీల్దార్కు అప్పీల్ ఇవ్వాలని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. సింహాద్రి పురం మండలానికి చెందిన సుబ్బరాయుడు అనే కాంట్రాక్టు ఫార్మసిస్తు మాట్లాడుతూ తనలాగా ల్యాబ్టెక్నీషియన్లకు జీత భత్యాలు ఇవ్వలేదని చెల్లించాలని కోరారు. రైల్వేకోడూరుకు చెందిన గంగాధర్ 2005లో వచ్చిన వరదల వలన ఇళ్లు కోల్పోయిన బాధితులకు 105మందికి ఇళ్లస్థలాలు ఇప్పిస్తామని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. అనంతరం చిన్నమండెం మండలం శ్రీరాంనగర్కు చెందిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత వారం తాము ఫోన్ చేసినందుకు కలెక్టర్ స్పందించి ఎంపిడిఓకు పంపారని, వారు వ్యక్తిగత మరుగుదొడ్లకోసం విచారణ జరిపి ప్రతిపాదనలు పంపుతామని తమ విజ్ఞప్తిని మన్నించి సమస్యను పరిష్కారానికి పంపినందుకు కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసి గిరిజాశంకర్, అదనపు జేసి జోషిబాబు, డిఆర్ఓ హేమసాగర్ తదితరులు పాల్గొన్నారు.
రాశి ఫలాలు






