కడప
మహిళల జీవితాల్లో వెలుగు నింపిన దుర్గాబాయి
-
నేడు శత జయంతి
జమ్మలమడుగు, జూలై 14 (కెఎన్ఎన్): స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసి ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగు నింపిన ధన్య జీవి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆమె 1909 జూలై 15 వ తేదీన కాకినాడలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే మంచి ప్రతిభా పాటవాలు కనబరుస్తూ 10 సంవత్సరాల వయస్సులో హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. 12 ఏళ్ల పసిప్రాయంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి పలు నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1921 లో గాంధీజీ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో పర్యటించారు. ఆ సమయంలో దుర్గాబాయి గాంధీజీ హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించి భేష్ అనిపించుకున్నారు. 1923 లో ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో వాలంటీర్గా ఉన్న దుర్గాబాయి ఆ ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూను టికెట్ లేని కారణంగా లోపలికి అనుమతించలేదు. దీంతో నెహ్రూ టికెట్ తీసుకొని ప్రదర్శనను తిలకించాల్సి వచ్చింది. దుర్గాబాయి ధైర్య సాహసాలను పలువురు అభినందించారు. కాగా దుర్గాబాయి మహాత్మా గాంధీ పిలుపు మేరకు జాతీయ ఉద్యమం కోసం పెద్ద సంఖ్యలో నగదు, నగలను విరాళాలుగా సేకరించి భారీ బహిరంగ సభలో గాంధీజీకి ఆ మొత్తాన్ని అందజేశారు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో దుర్గాబాయి 3 సార్లు జైలుశిక్ష అనుభవించారు. ఈ సందర్భంగా వివధ నేరాలు చేసి జైలులో కఠిన శిక్షలు అనుభవిస్తున్న మహిళా ఖైదీల దుస్థితి దుర్గాబాయిని ఎంతగానో ఆలోచింపజేసింది. మహిళల్లోని నిరక్షరాస్యత వారి వెనుకబాటు తనానికి కారణంగా గుర్తించి స్త్రీ జనోద్ధరణకై దుర్గాబాయి తన జీవితాన్ని అంకితం చేశారు. జైలు జీవితం వల్ల దుర్గాబాయి అనారోగ్యం పాలయ్యారు. రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనకుండా జైలు శిక్షకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు. మొదట తాను విద్యావంతురాలై నలుగురికి విద్యాదానం చేయాలన్న సంకల్పంతో తన 24 వ ఏట గోపరాజు రామచంద్రరావు వద్ద ఆంగ్ల భాషను అభ్యసించి 1922 లో ప్రైవేటుగా బెనారస్ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణురాలై అంచలంచెలుగా ఎదిగి 1941 లో ఎల్ఎల్బి పట్టాను పొందారు. ఒక వైపు దుర్గాబాయి చదువు కొనసాగిస్తూనే హైదరాబాద్లో 1937 లో బాలికా బృందావనం అనే పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. దుర్గాబాయి, ఆమె తల్లి కృష్ణవేణమ్మలు ఉపాధ్యాయినులుగా మారి బాలికలకు సంగీతం, నాట్యం నేర్పించడంతో పాటు బాలికల తల్లులకు హిందీ భాషను నేర్పించేవారు. ఈ సంస్థే 1938 లో ఆంధ్రమహిళా సభగా రూపుదిద్దుకుంది. 1946, 1952 మధ్య కాలంలో దుర్గాబాయి రాజ్యాంగ విధాన సభలో సభ్యురాలుగా, 1952, 53 లో ప్లానింగ్ కమీషన్ సభ్యురాలుగా పని చేశారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖా మంత్రిగా పని చేస్తున్న చింతామణి దేశ్ముఖ్ను వివాహం చేసుకొని నాటి నుండి దుర్గాబాయి దేశ్ముఖ్గా మారారు. దుర్గాబాయి ప్రజా సేవా కార్యక్రమాలకు ఆమె భర్త చేదోడు వాదోడుగా వ్యవహరించేవారు. ఆంధ్రమహిళా సభ ఆధ్వర్యంలో వైద్య శాలలు, శల్య చికిత్సా కేంద్రం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మహిళా విద్యాలయాలు, శిశు విహారములు, గ్రామీణ వృత్యాధార సాక్షరతా కేంద్రాలు, నర్సుల శిక్షణ శాల ఇలా ఎన్నో ఎన్నెన్నో సంస్థలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. 1953, 63 మధ్య కాలంలో సాంఘిక సంక్షేమ పరిషత్తుకు దుర్గాబాయి అధ్యక్షత వహించి మహిళల కోసం, శిశువుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థలు స్థాపించి దిక్కులేక అల్లాడిపోతున్న స్త్రీ, శిశువుల జీవితాల్లో కొంగ్రొత్త వెలుగులు నింపారు. కాగా దుర్గాబాయి పరిపాలన దక్షత కలిగిన ప్రజా సేవిక. తాను స్థాపించిన సంస్థలు తన తదనంతరం కూడా కొనసాగించుటకు అనువుగా తగిన కార్యకర్తలను తయారు చేసి సంస్థల నిర్వహణకు ముందుచూపుతో చక్కని ఏర్పాట్లు చేశారు. దుర్గాబాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో గౌరవించింది. 1971 లో విద్యా వ్యాప్తి కోసం చేసిన కృషికి నెహ్రూ లిటరసీ అవార్డు, యునెస్కో నుండి ఫార్ ఔట్ స్టాండింగ్ వర్క్ ఇన్ద ఫీల్డ్ ఆఫ్ లిటరసి అవార్డు, పాల్జి.హాఫ్మన్ పురస్కారాలు అందుకున్నారు. 1981 మే 9 న దుర్గాబాయి హైదరాబాద్లో కన్నుమూశారు. దుర్గాబాయి తన జీవిత కాలంలో ఒక వ్యక్తిగా కాక మహా సంస్థగా పేరెన్నికగన్నారు. గొప్ప సంఘ సంస్కర్త, మేధావి, న్యాయ కోవిదురాలు, మానవతావాది అయిన దుర్గాబాయి విరామమెరుగని సేవలు అందించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలచారు.
రాశి ఫలాలు






