ముఖ్యాంశాలు
అక్కడ ఎన్నికల తాయిలంముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు
-
పశ్చిమ బెంగాల్ సిఎం బుద్ధదేవ్ వెల్లడి
కోల్కతా, ఫిబ్రవరి 8 : పశ్చిం బెంగాల్లో ప్రభుత్వోద్యోగాల్లో ముస్లింలకు ఇతర వెనుకబడిన తరగతుల(ఒబిసి) కోటా కింద ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఒని రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిన రోజునే (సోమవారంనాడే) బుద్ధదేవ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. సాంఘిక, ఆర్థక, విద్యా రంగాల్లో వెనుకబడిన ముస్లింలకు ఈ పది శాతం రిజర్వేషన్లను కల్పించాలని వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వం నిర్ణయించినట్టు బుద్ధదేవ్ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఈ విషయమై రంగనాథ మిశ్రా కమిటీసిఫార్సులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని బుద్ధదేవ్ చెప్పారు. ఈ కమిటీ నివేదికపై కేంద్రం స్పందన వచ్చే వరకూ వేచి ఉండకుండా ఈ నివేదికను అమలు జేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు భట్టాచార్య చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు (ఒబిసిలకు) రిజర్వేషన్లను అమలు జేస్తామని ఆయన చెప్పారు. సాంఘిక, ఆర్థిక,విద్యా రంగాల్లో వెనుకబడిన ముస్లింలను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందనీ, ఒబిసిలకు రాష్ట్రంలో 7 శాతం రిజర్వేషన్లు అమలు జేస్తున్నామని ఆయన చెప్పారు. ముస్లింలలో వెనుకబడిన వర్గాలుగా గుర్తించిన 15 గ్రూపులకు ఉద్యోగాల్లో ఈ నాలుగు శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోనీ హైకోర్టు కొట్టి వేసింది.దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని దాఖలు చేయవలసిందిగా అడ్వొకేట్ జనరల్ డిఎస్ ఆర్ మూర్తిని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆదేశించారు.
రాశి ఫలాలు






