ముఖ్యాంశాలు
ఫ్రంట్లలో కుంపట్లు పవార్ పాలిటిక్స్
-
చర్చకు తెరలేపిన శరద్పవార్ధాకరేల భేటి
న్యూ ఢిల్లీ, (ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. యుపిఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సిపి చీఫ్ కేంద్రమంత్రి శరద్పవార్ శివసేన నాయకుడు బాలధాకరేను కలవడంతో ఈ చర్చకు తెరలేచింది. తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యతలేదని పవార్ చెప్పినప్పటికీ గత కొంతకాలంగా యుపిఏ ప్రభుత్వంలో ఆయన సంక్లిష్టస్ధితిని ఎదుర్కొంటున్నారు. దేశంలో ధరల పెరుగుదలకు పవార్నే కేంద్రప్రభుత్వం కార్నర్ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం జాతీయస్థాయిలో కాంగ్రెస్ తీరు మారింది.
2004 ఎన్నికల తర్వాతి కాలంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ తన మిత్ర పక్షాలను కూడా అదిమిపట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎన్డిఎ భాగస్వామ్య పక్షాలు చతికిలపడటంతో 2014ఎన్నికల నాటికి మూడో ప్రత్యామ్నాయమే కీలక పాత్ర పోషించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. 2009 ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరునాటి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం 2014ఎన్నికలనే లక్ష్యంగా చేసుకుంది. ఈసారి ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాహుల్ను ప్రధాని పీఠంలో కూర్చొబెట్టాలన్న పధకానికి అనుగుణంగా పావులు కదుపుతోంది. ప్రతిపక్షాలు కూడా ఏమీ తక్కువ తినలేదు. 2009ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ వెంటనే కోలుకున్నాయి. మూడునెలలు తిరక్కముందే 2014ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ప్రస్తుతం సోనియానే కేంద్రబిందువుగా చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాహుల్కు, కాంగ్రెస్కు గద్దె దక్కకూడదన్న లక్ష్యానికి అనుగుణంగా సోనియాపై వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడుతున్నాయి. శివసేన తరచూ సోనియాను ఇటాలియన్ మమ్మీగా పేర్కొంటూ ఆమె జాతీయతపై మరోసారి జాతీయ స్థాయి చర్చను రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్సే అతిపెద్ద పార్టీగా వుంది. సమర్ధురాలైన సోనియా ఆధ్వర్యంలో వరుసగా రెండు జాతీయ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలిసి కాంగ్రెస్ విజయం సాధించింది.సమర్ధుడు, తన అనుకూలుడైన మన్మోహన్సింగ్ను ప్రధాని పీఠంపై కూర్చొబెట్టి సోనియా తనకనుసన్నలలోనే దేశ పాలనను నిర్వహిస్తున్నారు. 2009ఎన్నికల తర్వాత ప్రతిపక్ష బిజెపి పూర్తిగా నిర్వీర్యమైంది. కాంగ్రెస్కుపోటీ ఇవ్వలేని పరిస్థితుల్లో వాజ్పేయి, అద్వాని, తదితర సీనియర్ నేతలు విశ్రాంతి కోరుతూ రిటైర్ కావడం ఆ పార్టీని మరింత శక్తిహీనం చేసింది. జాతీయ స్థాయిలో తగిన ప్రతిపక్షం కొరవడ్డంతో కాంగ్రెస్ పెద్ద శక్తిగా అవతరించింది. వరుసగా రెండు సార్లు మిత్రపక్షాల సాయంతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ మూడోసారి ఒంటిచేత్తో ఎన్నికలను ఎదుర్కోవాలని ఆరాటపడుతోంది. తనతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీల నేతలందరిని ఒక్కొక్కరుగా ఆ పార్టీ మట్టికరిపించింది. వారి సొంత రాష్ట్రాల్లోనే వారికి భవిష్యత్ లేకుండా చేసింది. 2004లో కాంగ్రెస్తో కలసి సాగిన వామపక్షాలు, ములాయంసింగ్, లాలూప్రసాద్ యాదవ్లను కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ దూరం పెట్టింది. 2009ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టిన తృణమూల్, ఎన్సిపి, డిఎమ్కెల ఆధిపత్యాన్ని కూడా కట్టడి చేస్తూ వస్తోంది.
ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా బలపడే విధంగా కృషి చేస్తోంది. దక్షిణ భారతంలో డిఎమ్కెతో జతకట్టినప్పటికీ ప్రస్తుతం వారి ఆధిపత్యాన్ని తగ్గించి తమిళనాడులో కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న తమిళనాడు, గుజరాత్, మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్ బాధ్యతలను యువనేత రాహుల్కు అప్పగించింది. ఆయనను తరచూ ఈ రాష్ట్రాల్లో పర్యటనలకు ప్రోత్సహిస్తోంది. దేశ ప్రజలను ఆకట్టుకోగలిగే సమర్ధుడైన నాయకుడిగా రాహుల్ను తీర్చిదిద్దుతోంది. దేశ ప్రధాని కాగల అర్హతలన్నింటినీ ఈ పర్యటనల ద్వారా ఆయన సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బిఎస్పి, శివసేన తదితర పక్షాలు ఇప్పటి నుంచే సోనియాను లక్ష్యంగా చేసుకుని అస్త్రాలు సంధిస్తున్నాయి. ముఖ్యంగా మరుగున పడ్డ ఆమె జాతీయత అంశాన్ని తిరిగి తెరపైకి తెస్తున్నాయి.
ఎన్నో శతాబ్దాలుగా భారత జాతి పరదేశీయుల పాలనలో మగ్గిపోయిందంటూ గత బానిసత్వపు స్మృతులను ప్రస్తుత కాలానికి గుర్తు చేసేందుకు ఈ రెండు పక్షాలు పని చేస్తున్నాయి. భారతదేశాన్ని భారతీయులు మాత్రమే పాలించాలన్న దృక్పథాన్ని దేశ ప్రజల్లో నూరి పోస్తున్నాయి. జాతీయతా అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని దేశ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా సోనియా నాయకత్వానికి చెక్ పెట్టాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను అంచెలంచెలుగా నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మూడో ఫ్రంట్ మాత్రమే సమర్ధంగా బదులివ్వగలదన్న సంకేతాలను ఇవి ప్రజలకిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సమైక్యతతో కాంగ్రెస్ను ఎదిరించి నిలువరించగలవన్న విశ్వాసాన్ని దేశ ప్రజలకు కల్పిస్తున్నాయి.
రాశి ఫలాలు






