ముఖ్యాంశాలు
ఈ నెల 15న ఎంసెట్ నోటిఫికేషన్
-
22 నుంచి దరఖాస్తుల విక్రయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : జవహార్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(హైదరాబాద్) మే 30న నిర్వహిస్తున్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్-2010) నోటిఫికేషన్ను ఈ నెల 15న జారీ చేయనున్నారు. దరఖాస్తుల విక్రయం ఈ నెల 22 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి చెప్పారు. సోమవారం మండలి కార్యాలయంలో జరిగిన ఎంసెట్ తొలి కమిటీ సమావేశంలో నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసులు, ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తులను విక్రయిస్తున్నట్లు సమావేశం అనంతరం కేసీ రెడ్డి చెప్పారు. మే 30న జరిగే ఎంసెట్లో ఉదయం పది నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు అగ్రికల్చర్ మెడిసిన్ పరీక్ష ఉంటుందని కేసీ రెడ్డి తెలిపారు.
విద్యార్థుల ఇంటికి ప్రశ్నాపత్రం
ఎంసెట్లో తొలిసారిగా పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఇంటికి ప్రశ్నాపత్రం తీసుకువెళ్లేందుకు అనుమతినిస్తున్నామని కేసీ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రశ్నాపత్రం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఎంసెట్ కమిటీ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. ఈ ఏడాది ఎంసెట్ దరఖాస్తుతో పాటు అదనంగా డేటా కార్డును అందచేస్తున్నామని, ఈకార్డులోని అంశాలను విద్యార్థులు భర్తీ చేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రశ్నాపత్రం విద్యార్థుల చేతికి ఇవ్వాలని నిర్ణయించడం వల్ల ఈ డేటా కార్డులోని అంశాలను విద్యార్థులు పూరించవలసిన పరిస్థితి ఏర్పడిందనీ, విద్యార్థి పేరు, కోడ్ నెంబర్, హాల్టికెట్ నంబరు తదితర వివరాలు ఈ కార్డులో ఉంటాయని చెప్పారు. పరీక్షా హాలు నుంచి విద్యార్థి బయటకు వెళ్ళే సమయంలో ఈ కార్డును అందచేస్తేనే వారి జవాబుపత్రం మూల్యాంకనం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఓఎంఆర్ షీట్, డేటా కార్డు ఉంటాయని, దరఖాస్తును కొనుక్కునే ముందు విద్యార్థులు ఇవి ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించాలని చెప్పారు.
రాశి ఫలాలు






