ముఖ్యాంశాలు
కోర్టు తీర్పునకు నిరసనగా ఎంఐఎం సెక్రటేరియట్ ముట్టడి
-
గేట్లకు తాళం వేసినా గోడదూకే ప్రయత్నం
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 4శాతం రిజర్వేషన్లు చెల్లవంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల మజ్లీస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇందుకు నిరసనగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సోమవారం సచివాలయాలన్ని ముట్టడించారు. ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, పాషా ఖాద్రీల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12.15 గంటలకు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఒక్కసారిగా ఎంఐఎం కార్యకర్తలు ముఖద్వారం వద్దకు దూసుకొచ్చారు. అప్పటికప్పుడు అప్రమత్తమైన సచివాలయ భద్రతా సిబ్బంది గేట్లకు తాళాలు వేసినప్పటికీ ప్రహారీగోడ ఎక్కి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు.
పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.దాదాపు 200 మంది కార్యకర్తలు నల్లజెండాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తగు విధంగా ముందడుగు వేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నగర పోలీస్ యంత్రాంగంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
రాశి ఫలాలు






